– త్వరలో బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే ఛాన్స్
– కీలక మార్పులు దిశగా రైల్వే అడుగులు
నిత్యం ఎంతో మంది రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. చాలా మంది రైళ్లల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా రైల్వే శాఖ నుంచి ఓ శుభవార్త వచ్చింది. ఇక నుంచి రెండో రిజర్వేషన్ ఛార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను మార్పుకోవచ్చు. ఈ మేరకు త్వరలోనే రైల్వే శాఖ కీలక మార్పులు చేయనుందని సమాచారం.రైల్వేలో ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రైలు బయలుదేరడానికి 10 నుంచి 20 గంటలకు ముందు తొలి చార్ట్ ప్రిపేర్ అవుతుంది. దీని తర్వాత బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడానికి అనుమతి ఉండదు. ఒకవేళ బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవాలంటే చార్ట్ ప్రిపరేషన్కు ముందే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఏదైనా అకస్మాత్తుగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలన్నా, వేరే స్టేషన్లో ట్రైన్ ఎక్కాలన్న ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. అయితే వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ టికెట్లకు బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవడానికి మరింత గడువు పొడిగించే అంశాన్ని రైల్వే శాఖ వర్గాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నాయి. త్వరలోనే దీనిని రైల్వే అధికారులు అమలు చేయనున్నారని తెలుస్తోంది.
ప్రయాణికులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే గడువును పొడిగించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇక నుంచి రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ అవ్వడానికి ముందు వరకూ మార్చుకునేందుకు అవకాశం కల్పించనుంది. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. రైలు బయల్దేరే 30 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను సవరించుకోవచ్చు. కొత్త ప్రతిపాదనతో ముందుకు సాగడానికి సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ను రైల్వే శాఖ ఆదేశించింది. ఆ సంస్థ నివేదిక సమర్పించిన తర్వాత తుది నిర్ణయం వెలువడే అవకాశముందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయానికి ఆమోదం లభిస్తే ప్రయాణికులకు భారీ ఉపశమనం కలగనుంది.
