– వైద్యులపై పెరుగుతున్న ఒత్తిడి
– కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి
కేజీహెచ్ లో వైద్యం పొందుతూ మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు.
సోమవారం ఆయన దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఇది ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు.
ఇటీవల కేజీహెచ్ లో ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని తిరిగి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని అన్నారు.
చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో ఎక్కువమంది ప్రజలు కేజీహెచ్ ను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. దీంతో ఈ ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అన్నారు.
అయితే కేజీహెచ్ లో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో జాప్యం జరుగుతుందన్నారు.
అక్కడ పనిచేస్తున్న పరిమిత సిబ్బంది ఎక్కువగా వస్తున్న రోగులకు మంచి చికిత్స అందిస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. కే జి హెచ్ కు వస్తున్న రోగుల డిమాండ్ మేరకు ఎక్కువ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ల వానపల్లి అక్షయ కుమార్ చికిత్స పొందుతూ కేజీహెచ్ లో మృతి చెందడం చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలుడికి ఆపరేషన్ జరిగిన రోజునే కేజీహెచ్ లో 13 సర్జరీలు జరిగాయని చెప్పారు.
కానీ దురదృష్టవశాత్తు
ఆ బాలుడు మృతి చెందడం బాధాకరమని అన్నారు.
ఆ బాలుడు తండ్రి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడని చాలా దయనీయ స్థితిలో ఆ కుటుంబం ఉందని తెలిపారు.
ప్రభుత్వం మానవత్వంతో స్పందించి ఆ బాలుడు కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు.
ఆ కుటుంబానికి తక్షణమే 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే
కేజీహెచ్లో రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అవసరమైన పోస్టుల భర్తీ చేయకపోవడంతో వైద్యులపై పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు.
మానవతా దృక్పథంతో వైద్యులు పనిచేస్తున్నప్పటికీ మ్యాన్ పవర్ లేకపోవడంతో తప్పిదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అలాగే వైద్య పని ఒత్తిడి తగ్గించేలా సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
