డ్రగ్స్, గంజాయి విభాగంలో ఆపరేషన్ -1972 కు మొదటి బహుమతి
సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, మహిళలు–పిల్లల భద్రత వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీ విశేష స్పందనను సొంతం చేసుకుంది. పోలీస్ శాఖ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి యువత, జర్నలిస్టులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యులయ్యారు.
సైబర్ క్రైమ్, యాంటీ డ్రగ్స్, ఉమెన్ & చిల్డ్రన్ అనే మూడు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం 93 షార్ట్ ఫిలిమ్స్ సమర్పించగా, నిపుణుల కమిటీ నాణ్యత ఆధారంగా 27 చిత్రాలను ఎంపిక చేసింది. వాటిలో ఫైనల్ దశకు 12 షార్ట్ ఫిలిమ్స్ చేరి ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించాయి.
యాంటీ డ్రగ్స్ విభాగంలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కుటుంబాలు, యువత జీవితం ఎలా ఛిన్నాభిన్నం అవుతుందో హృదయాన్ని తాకేలా గౌతమ్ అద్యుత్ ప్రోడక్షన్ పై “జర్నలిస్ట్ సత్య” నిర్మించిన ‘ఆపరేషన్–1972’ షార్ట్ ఫిల్మ్ కు మొదటి బహుమతి గా రూ.10,000 నగదుతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేశారు. రెండో బహుమతిగా రూ.5,000, మూడో బహుమతిగా రూ.3,000లను విజేతలకు అందించారు.
విజేతలకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో మార్పు తీసుకొచ్చే శక్తి సృజనాత్మక మాధ్యమాలకు ఉందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ తరహా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొని పోలీస్ శాఖకు చిత్రాలను అందజేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ, వారందరికీ ప్రోత్సాహకంగా మెమెంటో సర్టిఫికెట్లు అందజేశామని తెలిపారు.
భవిష్యత్తులో ఈ వీడియోలను అవగాహన కార్యక్రమాలు, ప్రచారాల్లో వినియోగించి ప్రజలను మోటివేట్ చేస్తామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఎస్పీలు, పోలీసు అధికారులు, సబ్ ఇన్స్పెక్టర్లు, విద్యార్థులు, యువత పాల్గొని విజేతలను అభినందించారు.
