40 అడుగుల సిరిమాను ఊరేగింపుకి సిద్ధం సిరిమాను అధిరోహించిన పూజారి జన్ని పేకాపు జగదీశ్వరరావు,సిరిమాను రథానికి నాణ్యత పరీక్షలు ఉత్తరాంధ్రల కల్పవల్లి శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం నేడు శంబర గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంగరంగ వైభవంగా జరగనుంది. సిరిమానుకు అవసరమైన తాడి చెట్టు ను శంబర గ్రామ సమీపంలో గల సోమడవలస పొలిమెరల నుండి సేకరించి ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోకి తీసుకువచ్చారు. సిరిమాను కర్రను సోమవారం ఉదయం నుండి గ్రామానికి చెందిన వడ్రంగి కుటుంబీకులు సిరిమానుగా మలచే పనిలో నిమగ్నమైనారు. వడ్రంగుల చేతిలో వంపులు తిరిగిన సిరిమాను చెట్టు గ్రామంలో ఊరేగించేందుకు సిరిమాను గా మార్చబడింది. గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అనువనువున నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సిరిమాను తయారు చేయడం జరిగింది. ఈ ఏడాది సిరిమాను పొడుగునా పసుపు పూత పూసి కుంకుమతో అద్దడం జరిగింది. సిరిమానికి ఉపయోగించే రథానికి సప్త వర్ణాలు రంగరించుకునని జాతరలో సిరిమాను తిప్పేందుకు ఉపయోగించనున్నారు. సిరిమాను తోపాటు రధానికి నాణ్యత పరీక్షలు రోడ్లు భవనాల శాఖ మరియు అటవీ శాఖ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం మూడు
గంటల సమయంలో జరిగే సిరుల తల్లి సిరిమాను సంబరానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుండే గాక సమీప రాష్ట్రాలైన ఒరిస్సా, చతిస్గడ్ రాష్ట్రాల నుండి లక్షలాది లో భక్తులు హాజరవుతారు. సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక శాతం మంది గిరిజనులు హాజరవుతారు. సినిమాను తిరుగుతుంది ఇలా.ముహూర్తం గడియలు సమీపించగా మంగళవారం మధ్యాహ్నం పూజారిని చదురు గుడి నుండి భుజాలపై మోసుకుంటూ యాత్రాస్థలంలో గల సిరిమాను వద్దకు తీసుకువస్తారు. అనంతరం అమ్మవారి ఘటాలను చదురు గుడి నుండి యాత్ర స్థలానికి బాజాభజంత్రీలతో నూతన వస్త్రాలపై నడుచుకుంటూ తీసుకు వస్తారు. అప్పటికే సిరిమాను వద్దకు చేరుకున్న పూజారి అమ్మ వారికి నమస్కరించి సిరిమాను అధిరోహించేందుకు సిద్ధమవుతారు. అమ్మవారి ఘటాలు తొలి పూజ కోసం గిరిడ వారింటికి, తదుపరి పూజ కోసం కుప్పిలి వారి ఇంటికి, అనంతరం అప్పటి గ్రామ మునసబు ఇంటికి నడవగా… యాత్ర స్థలములో సిరిమాను సంబరం మొదలవుతుంది. సిరిమానుకు పూజలు నిర్వహించి, యాత్రాస్థలం లోనే మూడుసార్లు తిప్పుతారు. సిరిమాను కూడా అమ్మవారి ఘటాల వలె తొలి పూజ కోసం గిరడ వారింటికి, రెండవ పూజ కోసం కుప్పిలి వారి ఇంటికి, మూడవ పూజ కోసం అప్పటి గ్రామ మునసబు ఇంటికి వెళ్లి పూర్వాచార ప్రకారం. అనంతరం అమ్మవారి ఘటాలు తిరువీధి నిమిత్తం పణుకు వీధి మీదుగా పయనమవగా… సిరిమాను ప్రధానవీధి, పణుకు వీధి, గొల్లవీధి, కొత్తవీధి, గాంధీనగర్ మీదుగా చదురు గుడి వీధి గుండా ప్రధాన వీధికి చేరుకుంటుంది. పూర్వాచార ప్రకారం అక్కడ సిరిమాను రథం తో సహా తిరగ వేయడం ఆనవాయితీ. ఈ విధంగా శంబర సిరుల తల్లి సిరిమాను సంబరం సాగుతుంది. ఇలా అమ్మవారు తిరువీధి చేస్తారు ,శ్రీ పోలమాంబ అమ్మవారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యాత్రా స్థలం నుండి తిరువీధి కోసం బయలుదేరి, బుధవారం ఉదయం పది గంటల సమయానికి యాత్రా స్థలం లోగల గద్దె వద్దకు చేరుకుంటారు. అనంతరం ఉయ్యాల కంబాల ఉత్సవం జరిగిన పిమ్మట అంకోత్సవానికి వనం గుడికి బయలుదేరుతారు.
