ఐదో రోజు ప్రవచన యజ్క్షంలో సామవేదం షణ్ముఖ శర్మ
జ్ఞాన వైరాగ్యమే భాగవత పరమ ప్రయజనమని ప్రవచనవిరించి, వాగ్ధేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం, సత్సంగం, విశాఖపట్నం ఆధ్వర్యాన ఎంవీపీ కాలనీ, ఆరో సెక్టార్, ఎబీసీ పార్కులో 14 రోజుల శ్రీమద్భాగవవ ప్రవచన యజ్ఞం ఐదో రోజైన సోమవారం సాయంత్రం ప్రవచనంలో సప్తమ స్కంధంలోని ప్రహ్లాదుని జ్ఞాన భక్తి విధాన్ని ప్రవచనకర్త వివరించారు. ఏది భద్రం? ఏది ఉత్తమం? అని తండ్రి హిరణ్యకశ్యపుడు అడిగిన అడిగిన ప్రశ్నకు ప్రహ్లాదుడిచ్చిన సమాధానం ప్రవచనకర్త ఆసక్తికరంగా వివరించారు. ప్రహ్లాదుడి మాటలన్నీ ఒకచోట చేర్చి పఠిస్తే అది భాగవత గీత అవుతుందన్నారు. మానవ జన్మకు భగవత్ అభిముఖ భక్తి కావాలన్నారు.
శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఈ తొమ్మిదింటినీ నవవిధ భక్తివిధానాలంటారని ఉపదేశించారు. అందరి క్షేమం కోరేవాడే భగవంతుడు. హరి భక్తి లేని జీవితం వ్యర్ధం అని సామవేదం పేర్కొన్నారు.
అజ్ఞానం అచ్చపు చీకటి. విష్ణు జ్ఞానం చేత మాత్రమే అవిద్యను దాటగలమని సామవేదం వివరించారు. మనస్సు కంటే పెద్ద శత్రువు ఎవరు మానవుడికి లేడన్నారు. దాన్ని జయించలేకపోతే అరిషడ్వర్గాలైన కామ,క్రోధ,మోహ,లోభ,మద, మత్సరములతో మనస్సు నిండిపోతుందన్నారు. తండ్రి ఆజ్ఞానుసారం రాక్షసులు తనను ఎన్నిరకాలుగా హింసించినా పరమాత్ముడు సర్వ స్వరూపుడు అని నారాయణ నామరూపాలనే స్మరించడం ప్రహ్లాదుడి జ్ఞానభక్తికి నిదర్శనమన్నారు. తనకు హాని చేసే శత్రువు క్షేమాన్ని కూడా కోరుకోవడమే అసలు భక్తి. ఇదీ భాగవత మూల సూత్రం. అందుకే 12 స్కంధాలున్న శ్రీమద్భాగవతంలోని ఆరో స్కంధంలో గుండెకాయవంటి చోటున ఈ విషయాలను నిక్షిప్తం చేసిన శుకమహర్షి తీరు అద్భుతమన్నారు. ఇంద్రియాలకు అనుభవింపడేదాన్ని ప్రత్యక్షం అంటారు. అర్తో,జిజ్ఞాసు,అర్థార్ధి, జ్ఞాన ఈ నాలుగూ చతుర్విధ భక్తి విధానాలని సామవేదం వివరించారు.
