శానపల్లిలంక గ్రామంలో ఎనిమిది సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనపై మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ చేసింది. ఈ ఘటనలో ముద్దాయి ఎడ్ల సూరిబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని మానవ హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఇక్బాల్ డిమాండ్ చేసారు. సదరు నిందితుడు గతంలో కూడా ఇదే బాలికపై అత్యాచారం చేశాడని, బాలిక తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, కేసు కాకుండా గ్రామ పెద్దల ఒత్తిడి మేరకు రాజీ చేసుకునేలా చేశారని గ్రామస్తులు చెప్పారన్నారు. గతంలో జరిగిన సంఘటనపై పోలీసులు తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన పునరావృతమైందని ఆయన భావించారు. పోక్సో చట్ట ప్రకారం నిందితుడ్ని వెంటనే ఆరెస్టు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు తక్షణమే నమోది చేయాలనీ బాధితుల కుటుంబానికి చట్ట ప్రకారం రావాల్సిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలనీ బాలికకు అవసరమైన వైద్య సహాయం అందించాలనీ ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో పలు పోక్సో కేసుల్లో బెయిల్ హియరింగ్ సమయంలో బాధితులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వకపోవడం వల్ల నిందితులు త్వరితగతిన బెయిలుపై బయటకు వచ్చి సాక్షులను ప్రభావితం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది ఇలా ఉండగా ఈ కేసులో నిందితుడు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అమలాపురం లో హాస్పిటల్ లో నాటకీయంగా చేరడం అరెస్టు తాత్సారం కావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.ఇప్పటికయినా పోక్సో కేసుల్లో పోక్సో చట్ట నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నిజనిర్ధారణలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద రాజేష్, ఉపాధ్యక్షుడు ఏ రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి నామాడి శ్రీధర్, కార్యవర్గ సభ్యుడు పవన్ కూడా పాల్గొన్నారు.
