వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో జరిగిన కల్తీ వ్యవహారం క్షమించరాని మహాపాపమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. సిట్ నివేదికతో వైకాపా నేతల కుంభకోణం బట్టబయలైన నేపథ్యంలో గురువారం ఆయన కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ర్యాలీగా చేరుకుని ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలు లేకుండానే నెయ్యి ఎలా తయారైందో వైకాపా నేతలే సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డు కల్తీపై తాము చేసిన ఆరోపణలే నేడు సిట్ దర్యాప్తులో నిజమని తేలిందన్నారు. కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదం తయారు చేసి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఇలాంటి పాపాలు చేసిన వైకాపాను ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఇదే వారి రాజకీయ పతనానికి కారణమని ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
