Home Politics Andhra Pradesh మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత

మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత

0

పాముతో నిరసన తెలిపిన కౌన్సిలర్ అనిల్
శుక్రవారం నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. తమ వార్డులో పాముల సంచారం అధికమైందని ఆరోపిస్తూ కౌన్సిలర్ అనిల్ కౌన్సిల్ హాల్‌లోకి సజీవ పామును తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది.
తన వార్డులో ఇళ్లలోకి, కాలనీల్లోకి తరచుగా పాములు ప్రవేశిస్తున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని అనిల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. “ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. సమస్య తీవ్రతను తెలియజేయడానికే పామును తీసుకువచ్చాను” అని ఆయన పేర్కొన్నారు.
కౌన్సిల్ హాల్‌లో పాము కనిపించడంతో సభ్యులు, అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొంతసేపు సమావేశం నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పామును సురక్షితంగా పట్టుకుని బయటకు తరలించారు.
ఈ ఘటనపై చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశ గౌరవాన్ని కాపాడాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు, సమస్యపై తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.
పట్టణంలో మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడం, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం వల్లే పాముల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమస్యపై మున్సిపాలిటీ సమగ్ర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version