Home Politics Andhra Pradesh ట్రాఫిక్ సమస్యలకు చెక్

ట్రాఫిక్ సమస్యలకు చెక్

0

జక్కంపూడి విగ్రహం పరిసరాల సుందరీకరణ పనుల పరిశీలన
రూ.3.50 లక్షల వ్యయంతో పనులు – ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం నగరంలోని కంబాల చెరువు సమీపంలో ఉన్న మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు విగ్రహం వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రూ.3.50 లక్షలతో చేపట్టిన పనులను ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ప్రారంభమైన పనులు వివిధ కారణాలతో మధ్యలోనే నిలిచిపోయాయని, ప్రస్తుతం వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. జంక్షన్ నిర్మాణం సక్రమంగా లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యమన్నారు.
సుందరీకరణతో పాటు రాకపోకలకు సౌలభ్యం
విగ్రహం చుట్టూ సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ, ట్రాఫిక్ మలుపుల సరిదిద్దడం వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయ్యాక వాహన రాకపోకలు సాఫీగా సాగుతాయని పేర్కొన్నారు.
బాటిల్‌నెక్ జంక్షన్‌లకు ప్రాధాన్యం
నగరంలోని తాడితోట, సురుచి సెంటర్, సిమెంటరీ పేట ప్రాంతాల్లో ఉన్న బాటిల్‌నెక్ జంక్షన్‌ల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. కొన్ని పనులు టెండర్ దశలో ఉన్నాయని, దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు.
నగరంలో ట్రాఫిక్, పరిశుభ్రత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version