రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు జక్కంపూడి రాజా నివాసం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజమహేంద్రవరం నగరంలోని ప్రకాష్ నగర్ కార్తికేయ అపార్ట్మెంట్స్ ప్రాంతానికి భారీ ఎత్తున పోలీసులు తరలివచ్చారు. అంబటి రాంబాబు కు సంఘీభావంగా గుంటూరు వెళ్లేందుకు సిద్ధమైన జక్కంపూడి కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.
జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైసీపీ యువజన నాయకులు జక్కంపూడి గణేష్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు–వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తమను ఎందుకు వెళ్లనీయడం లేదని జక్కంపూడి రాజా పోలీసులను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని, రాజకీయ కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జక్కంపూడి రాజా, “రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు” అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలను ముందస్తుగా నిర్బంధించడం ద్వారా ప్రభుత్వానికి భయమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అపార్ట్మెంట్స్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజమండ్రిలో జక్కంపూడి రాజా నివాసం వద్ద ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు – హౌస్ అరెస్ట్
RELATED ARTICLES
