రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశం
– ఎస్పీడీసీఎల్కు రూ. 118 కోట్లు బకాయిలు
– బకాయిలు ఎగ్గొట్టేందుకు కోర్టుకెక్కిన గీతం
– హై కోర్టు డివిజన్ బెంచ్ కి బాసటగా నిలిచిన సుప్రీం
తెలంగాణ గీతం యూనివర్శిటీకి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 4 వారాల్లోగా రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. విద్యుత్ బకాయిల కేసులో తెలంగాణా హై కోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీం కోర్టు సమర్ధించింది. అయితే హైకోర్టు ఆదేశాలను గీతం యాజమాన్యం సుప్రీంలో సవాలు చేసింది. వీబీసీ, గీతం యూనివర్శిటీలు వేర్వేరంటూ గీతం యాజమాన్యం నమ్మబలుకుతోంది. కానీ ఈ రెండు ఒక్కటేనన్నది ఎస్పీడీసీఎల్ వాదన. గత కొన్నేళ్లుగా వీబీసీ, గీతం యూనివర్శిటీలు కలిసే పని చేస్తున్నాయి. విద్యుత్ను పెద్ద ఎత్తున వినియోగించుకుని బిల్లులు చెల్లించాలనగానే తమకు సంబంధం లేదని గీతం చేతులెత్తేసింది. దాదాపు రూ. 118 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ సంస్థకు బకాయిపడినా ఎందుకు విద్యుత్ కనెక్షన్ తొలగించలేదో అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పలుకుబడి కారణంగానే రూ. వందల కోట్లలో బకాయి పడినప్పటికీ ఆ వైపు ఎస్పీడీసీఎల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. సాధారణ ప్రజలు రూ. 100 బకాయి పడితేనే మీటర్ ఫ్యూజ్ ఎత్తుకెళ్లిపోయే విద్యుత్ శాఖ అధికారులు ఈ విషయంలో ఎందుకు నోరెత్తలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున బకాయిలు ఉండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసినా గీతం నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం ఆదేశాలతో గీతం విద్యా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గీతం అధినేత విశాఖ ఎంపీగా ఉన్నారు.
