Home Devotional సింహాచలానికి ఆధ్యాత్మిక శోభ..దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ-గంటా

సింహాచలానికి ఆధ్యాత్మిక శోభ..దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ-గంటా

0

సింహాచలం, జయ జయహే_ అయోధ్య వంటి పుణ్య క్షేత్రాల మాదిరిగా సింహాచలంలో కూడా ఆధ్యాత్మిక శోభ వెదజల్లేలా వివిధ డిజైన్లతో లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. బి.ఆర్.టి.ఎస్. రోడ్డులో రూ. 1.37 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను మేయర్ పీలా శ్రీనివాసరావు కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులు, నిత్యం రాకపోకలు సాగించే ప్రజల కోసం యుద్ధ ప్రాతిపదికన పాత గోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకు లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. సింహాచలం స్ట్రెచ్ లో మాత్రమే ఒకే డివైడర్ తో బి.ఆర్.టి.ఎస్. రోడ్డు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. సింహాచలం క్షేత్ర గొప్పతనాన్ని తెలియజేసే ఆర్చ్ లు.. నామాలు.. డిజైన్ లైటింగ్.. లకు అవసరమైన నిధులు ఇవ్వడానికి మేయర్ సంసిద్ధత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సింహాచలం బి.ఆర్.టి.ఎస్. రోడ్డు పెండింగ్ టీడీఆర్ ల సమస్య కొలిక్కి వచ్చిందని, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నియమించిన కమిటీ అనుకూలమైన నివేదిక ఇచ్చిందన్నారు. పంచగ్రామాల భూ సమస్యను కోర్టు ముందు ఉంచామని, తొందర్లోనే 12 వేల కట్టడాల రెగ్యులరైజేషన్ జరుగుతుందని తెలిపారు. స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులు ఒకటి, రెండు రోజులు గడిపే అవకాశం లేకపోవడం విచారకరమన్నారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడం వల్ల అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోలేక పోతున్నాయని చెప్పారు. దేవస్థానం సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. 3 వేల మందికి పైగా పెట్టుబడిదారులు పాల్గొన్న విశాఖ సమ్మిట్ రాష్ట్రానికి వెల్లువలా పరిశ్రమలను తెస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పి.వి.నరసింహం, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, పంచదార్ల శ్రీనివాస్, బూర్ల కనకారావు, గుసిడి అవినాష్, తోట మధు, సీర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version