ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ లో ఫ్లవర్ షో స్పెషల్ అట్రాక్షన్ అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ లో వి.ఎం.ఆర్.డి.ఎ. ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఫ్లవర్ షో ను గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. పువ్వులు.. పండ్లు.. కాయగూరలతో చేసిన వివిధ ఆకృతులను పరిశీలించి బాగున్నాయని ప్రశంసించారు. విశాఖ ఉత్సవ్ లో ఫ్లవర్ షో వీక్షించడానికి పెద్దఎత్తున ప్రజలు వస్తారన్నారు. గతంలో నిర్వహించిన విశాఖ ఉత్సవ్ లలో ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఫ్లవర్ షో తేదీలను పొడిగించే వాళ్లమని తెలియజేశారు. యునైటెడ్ కింగ్ డమ్, నెదర్లాండ్స్ వంటి దేశాలతో పాటు బెంగళూరు తదితర నగరాల్లో క్రమం తప్పకుండా ఫ్లవర్ షోలు నిర్వహిస్తారని వివరించారు. నగర ప్రజలు ఫ్లవర్ షో ను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
