ఎస్సీ, ఎస్టీ లకు ఉచితంగా 2 కిలోవాట్ యూనిట్లు, ఇతరులకి 78 వేల సబ్సిడీ
– కలెక్టర్ కీర్తి చేకూరి
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు
జిల్లాలోని మలకపల్లి గ్రామం సోలార్ మోడల్ విలేజ్గా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. కోటి ప్రత్యేక గ్రాంట్ మంజూరు కావడం ద్వారా గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
బుధవారం మలకపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఎస్సీ-ఎస్టీ సూర్య ఘర్ యోజన ఉత్సవ్లో కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం రెండు గృహాలలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లు ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గ్రామంలోని 68 గృహాలపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో తొలి సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిందన్నారు.
గ్రామానికి వచ్చిన గ్రాంట్తో పిహెచ్సీ, పాఠశాలలు, వీధి దీపాలు, త్రాగునీటి పంపింగ్ వంటి అవసరాలకు సోలార్ విద్యుత్ అందించే మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల భవిష్యత్తులో విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి, ఆ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నదని, అందులో భాగంగా ఉచితంగా 2 కిలోవాట్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూఫ్టాప్ ఉన్న ఇళ్ల యజమానులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే 4704 మంది దరఖాస్తు చేసుకున్నారని, దశల వారీగా యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీసీ, ఇతర వర్గాలకు రూ.78 వేల సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కే తిలక్ కుమార్, ఇంచార్జి తహసిల్దార్ డి దుర్గా ప్రసాద్, ఎంపీడీఓ చక్రపాణి రెడ్డి మండల వ్యవసాయ అధికారి రుచిత, టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి , ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ , మద్దిపాటి ప్రకాష్ , సిద్దా దుర్గాప్రసాద్ , నామన పరమేష్ , బేతిన నారాయణ , ఇండుగుల రామకృష్ణ , స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు గెడ్డం జగన్ , బోడపాటి గంగరాజు , కోడి శంకర్రావు , తీగిరిపల్లి గోపి, బూరయ్య , అన్నమరెడ్డి సత్తిబాబు విద్యుత్ తదితరులు పాల్గొన్నారు..
