ఏయూలో తీవ్ర ఉద్రిక్తత
– వందేమాతరం’ అభ్యాసంపై దాడి
– ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దుశ్చర్యగా ఏబీవీపీ అభివర్ణన
– రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి ఆగ్రహం
ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ‘వందేమాతరం’ గేయాన్ని అభ్యసిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఎస్ఎఫ్ఐకి చెందిన వారు సామూహికంగా దాడికి పాల్పడటం క్యాంపస్లో కలకలం రేపింది. వందేమాతరం గేయం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఏబీవీపీ కార్యకర్తలు నిత్యం క్యాంపస్లో గేయ అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాటి కార్యక్రమానికి విదేశీ భావజాలం గల కొందరు అధ్యాపకులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ముందస్తు ప్రణాళికతో అడ్డు తగిలారని ఏబీవీపీ ఆరోపించింది.
కర్రలు, రాళ్లతో విరుచుకుపడి కార్యకర్తలను గాయపరిచారని పేర్కొంది.
*దేశభక్తిని మతంలా చూడొద్దు: వెంకట్ గోపి*
ఈ ఘటనను ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ గోపి తీవ్రంగా ఖండించారు. ‘భారత్ మాతా కి జై’ అని నినదించడం దేశభక్తికి నిదర్శనమే తప్ప మతపరమైన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. వందేమాతరం నినాదాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఏబీవీపీ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
– అంతర్జాతీయ కుట్ర కోణంపై అనుమానాలు..?
ప్రస్తుతం విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న తరుణంలోనే ఈ ఘర్షణలు జరగడం వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందేమోనని వెంకట్ గోపి అనుమానం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా ఎస్ఎఫ్ఐ వర్గీయులు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థుల్లో దేశ వ్యతిరేక భావజాలాన్ని నూరిపోస్తున్నారని ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
త్రీ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే ప్రస్తుతం అల్లర్లు తగ్గినట్టు కనిపిస్తున్నా మళ్ళీ ఏ వేళలో అయినా పరస్పర దాడులు చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది.
