పత్రాలు లేని 26 వాహనాలు సీజ్
తూర్పుగోదావరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటిలింగాల ఘాట్ ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో నాలుగు ప్రత్యేక బృందాలుగా విభజించిన పోలీసులు కోటిలింగాల ఘాట్ పరిసర ప్రాంతాల్లో అణువణువూ గాలించి తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా టింబర్ డిపోలు, మిల్లులు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు మరియు నెంబర్ ప్లేట్లు లేని 26 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.
అలాగే అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులు ఆరా తీశారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలతో ప్రతిజ్ఞ కూడా చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతిరోజు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ వి. అప్పారావు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ బాజీ లాల్, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ బాల శౌరి తదితర సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
కోటిలింగాల ఘాట్లో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
RELATED ARTICLES
