ఎస్పీ డి. నరసింహ కిషోర్
తూర్పుగోదావరి జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు “పల్లెనిద్ర (గ్రామ, వార్డు)” కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. నేరాలు జరగకముందే నివారించేందుకు ముందస్తు పోలీసింగ్ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని వివిధ గ్రామాలు, వార్డుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పర్యటించి ప్రజలతో ప్రత్యక్షంగా సంభాషించారు. స్థానిక సమస్యలు, భద్రతాపరమైన అంశాలపై వివరాలు సేకరించి, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, పోలీసు–ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడితేనే సమాజంలో శాంతి భద్రతలు నిలకడగా ఉంటాయని అన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీస్ అధికారులకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
సమాజంలో జరుగుతున్న నేరాలు, అమలులోకి వచ్చిన నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మహిళా భద్రత, సెల్ఫ్ డిఫెన్స్, సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, ట్రాఫిక్ నిబంధనలు, సోషల్ మీడియా మోసాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, బాల్య వివాహాల నివారణ, శక్తి యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు నేరాల అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు తెలిపారు.
