అఖండ విజయం
బిహార్ లో ఎన్డీఏ జయభేరి
243 స్థానాల్లో 203 చోట్ల గెలుపు
34 స్థానాలకే మహాగఠ్ బంధన్ పరిమితం
సొంత రాష్ట్రంలో బోల్తా పడ్డ ప్రశాంత్ కిశోర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీతో గెలుపొందింది. మెుత్తం 243 స్థానాలకుగాను 203 చోట్ల జయభేరి మోగించింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్బంధన్ కూటమిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. విపక్ష కూటమి 34 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నెలకొల్పిన జనసూరజ్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. బిహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి నినాదానికే జై కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నేలా ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. 243 అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీకి 122 సీట్లు అవసరం కాగా, ఏకంగా 203 స్థానాల్లో విజయాన్ని కట్టబెట్టారు. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ-రామ్విలాస్ పాసవాన్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్మోర్చా పార్టీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ-రామ్విలాస్ పార్టీ 29 చోట్ల బరిలో నిలిచింది. హిందూస్థానీ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్మోర్చాలు చెరో 6 స్థానాల్లో పోటీ చేశాయి. బీజేపీ 90, జేడీయూ 85, ఎల్జేపీ-రామ్విలాస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందాయి. హిందూస్తానీ ఆవామ్ మోర్చా 5, రాష్ట్రీయ లోక్మోర్చా 4 చోట్ల విజయం సాధించాయి. ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరీ తారాపూర్లో 45,843 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్లో విజయ ఢంకా మోగించారు. దానాపూర్లో రామ్ కృపాల్ యాదవ్ 29,133 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జానపద గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీఠాకూర్ అలీనగర్ నుంచి విజయం సాధించారు. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా శబరిని ఉద్దేశిస్తూ మైథిలీ పాడిన పాటను ప్రధాని అభినందించారు కూడా. ఎన్నికల సమయంలో హత్య కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ మొకామా నియోజకవర్గంలో 28వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎన్డీఏ కూటమి 203
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 90
జనతాదళ్ -యునైటెడ్ (జేడీయూ) 85
లోక్ జనశక్తి పార్టీ-రామ్ విలాస్ (ఎల్జేపీ-ఆర్వీ) 19
హిందూస్థానీ ఆవామ్ మోర్చా -సెక్యులర్ (హెచ్ఏఎం (ఎస్)) 5
రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) 4
కుప్పకూలిన మహాగఠ్బంధన్
మహాగఠ్బంధన్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసింది. కేవలం 33 స్థానాల్లో మాత్రమే ఆ కూటమి ప్రభావం చూపగలిగింది. మహాకూటమిలో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 24 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే గుడ్డిలో మెల్ల నయం అన్నట్లుగా మహాగఠ్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ రాఘోపూర్లో 14వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం.
ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఆ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేయగా, కేవలం 6 సీట్లు మాత్రమే పొంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విపక్ష కూటమిలోని వామపక్ష పార్టీల్లో సీపీఐ(ఎం) ఒక స్థానంలో, సీపీఐ-ఎంఎల్ 2 స్థానాల్లో, ఐఐపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. వికాసీల్ ఇన్షాన్ పార్టీ (వీఐపీ) అయితే కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు, జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.
