శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామివారి దేవస్థానంలో ఏర్పాట్లు దేవస్థానం అభివృద్ధి, చందనోత్సవ ఏర్పాట్లపై ఈఓ సమీక్ష సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థాన అభివృద్ధి పనులు మరియు ఏప్రిల్ 20న జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘చందనోత్సవం’ ఏర్పాట్లపై ఆలయ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో , ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కార్యనిర్వహణాధికారులు మరియు పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో తొలుత ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.
అభివృద్ధి పనులు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవానికి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల ఏర్పాటు, చలవ పందిళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు ఎండ, వాన తగలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం వివిధ విభాగాల (సెక్షన్ల) అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నారు.
దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు, ప్రసాదం పంపిణీలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
పారిశుధ్యం, విద్యుదీకరణ, భద్రత మరియు రవాణా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.
ఉత్సవ సమయంలో అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా సేవలందించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఇతర ఆలయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఏప్రిల్ 20న చందనోత్సవం
RELATED ARTICLES
