పరిస్థితిని నిరంతర పర్యవేక్షణ
అత్యవసర సాయం కోసం ఏపీ ఎన్నార్టీ
వివరాలు నమోదు చేసుకోవాలి
విమానాల పునరుద్ధరణ వరకే అక్కడే ఉండండి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపు
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులకు అభయం
ఇరాన్ – ఇజ్రాయెల్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయాందోళన నెలకొంది. ఎటువైపు నుంచి బాంబులు వచ్చి పడతాయోనని గల్ఫ్ దేశాల్లోని భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అక్కడ నివసిస్తున్న ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని, ఇండియన్స్ భద్రతను కేంద్ర విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ఏపీ ఎన్నార్టీ ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 85000 27678 ను అందుబాటులోకి తెచ్చింది. గల్ఫ్ బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ apnrts.ap.gov.in ను సంప్రదించాలని సూచించారు. గల్ఫ్ ప్రాంతంలోని ఏపీ పౌరులందరూ వెంటనే తమ వివరాలను ఇండియన్ ఎంబసీలో నమోదు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రస్తుతం నిలిచిపోయిన విమాన సర్వీసులు త్వరలోనే పునరుద్ధరిస్తారని, అప్పటి వరకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే అనుసరించాలని ఆయన పౌరులను హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించడాన్ని ఇరాన్ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. తమ దేశ అత్యున్నత నాయకుడి మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, ఈ చర్యకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ క్యాబినెట్ హెచ్చరించింది. దాంతో దుబాయ్, సౌదీ అరేబియా సహా పలు దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు, బేస్ క్యాంపులను టార్గెట్ చేసుకుని ఇరాన్ డ్రోన్, మిస్సైల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ మీద సైతం ప్రతీకార జ్వాలలతో ఇరాన్ ఆర్మీ రగిలిపోతోంది.
