ఆంధ్రప్రదేశ్ శాసనన వ్యవస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆటవిడుపు” ఎమ్మెల్యే–ఎమ్మెల్సీ క్రీడా, సాంస్కృతిక ఉత్సవాలు–2026 కార్యక్రమం కళా వైభవంతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబ్రహ్మన పాత్రను ధరించి సభలోని అందరినీ ఆకట్టుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా నిర్వహించిన నాటికలో మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబ్రహ్మన పాత్రలో వేదికపై కనిపించగానే సభలో హర్షధ్వానాలు వినిపించాయి. దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ పాత్రను ఆయన అత్యంత ఉత్సాహంగా, ఆవేశభరితంగా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. కట్టబ్రహ్మన ధైర్యసాహసాలను ప్రతిబింబించే సంభాషణలను భావోద్వేగంతో పలికి సభలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, అతిథుల నుంచి అభినందనలు అందుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు కేవలం రాజకీయాల్లోనే కాకుండా కళా, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం మంచి సంప్రదాయం అని పేర్కొన్నారు. “ఆటవిడుపు” కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధుల్లో స్నేహభావం పెంపొందడంతో పాటు కళలకు ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు.
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. క్రీడా పోటీలు, నాటికలు, సంగీత కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ వేడుకలు సందడి చేస్తున్నాయి.
ముఖ్యంగా మంత్రి కందుల దుర్గేష్ వీరపాండ్య కట్టబ్రహ్మన పాత్రధారణ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన నటనకు సభలో ఉన్న ప్రజాప్రతినిధులు నిలబడి అభినందనలు తెలియజేశారు. కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
