పరిశీలిస్తామన్న మంత్రి నారాయణ
మెట్రో ను మొదటి దశలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు పొడిగించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన సూచనకు మున్సిపల్ మంత్రి పి.నారాయణ స్పందిస్తూ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. మెట్రో అధ్యయనంలో భాగంగా వచ్చిన బృందాన్ని కొమ్మాది జంక్షన్ లో గంటా కలిశారు. కూర్మన్నపాలెం నుంచి కొమ్మాది వరకు మెట్రోను పరిమితం చేయడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరదని గంటా చెప్పారు. భోగాపురం విమానాశ్రయాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ వరకూ మెట్రోను పొడిగించాలన్నారు. మధురవాడ పరిసరాలు ఐటీ – టూరిజం హబ్ గా మారుతున్న నేపథ్యంలో ఉన్నతశ్రేణి ఐటీ నిపుణులకు, టూరిస్టులకు మెట్రో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. సాధ్యమైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మూడేళ్లలో మెట్రో పట్టాలు ఎక్కించాలన్న గడువుకు తగ్గట్టు ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి, కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ తేజ్ భరత్ తదితరులతో గంటా మాట్లాడి మెట్రోకు సంబంధించి పలు సూచనలు చేశారు.
