ఓర్చుకోలేకనే డైవర్షన్ పాలిటిక్స్
రెండేళ్లుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ఊసే ఎత్తలేదు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కూడిన మావిగన్ ప్రాంతాన్ని ఒక కారిడార్గా అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అవుతుందని ప్లాన్–బీ గా జగన్ సూచిస్తే అధికార పార్టీ ఒక్కసారిగా ఉలిక్కి పడిందని వైసీపీ విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. వారం రోజులుగా పరిపాలన పూర్తిగా గాలికొదిలేసి మావిగన్ను ట్రోల్ చేయడానికి అల్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నేతలతో కలసి ఆయన మాట్లాడుతూ, మావిగన్ అనేది వాళ్లకు వేల కోట్ల అవినీతి మీద ఎక్కు పెట్టిన గన్లా కనిపించింది. రూ.20 వేల కోట్లతో మావిగన్ ఏరియాను డెవలప్ చేస్తే సరిపోతుందని సూచిస్తుంటే కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారు? అమరావతి కోసం గొప్ప చట్టాన్ని తెచ్చామని చెప్పుకునే మీరంతా ఎందుకు ఆవేశపడిపోతున్నారు? అమరావతిని పూర్తి చేయడానికి తరాలు పడుతుందని మీరే చెబుతున్నప్పుడు త్వరితగతిన పూర్తయ్యే మావిగన్ ఐడియా మంచిదే కదా. అందుకేనా మీలో ఈ భయం? ఎప్పుడూ లేనిది అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలని హడావుడి చేస్తున్నారు.
ఏడేళ్లు అధికారంలో ఉండి అమరావతి కోసం కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినప్పుడు, వారు చెప్పిన రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేసి లక్ష ఎకరాలు డెవలప్ చేయడానికి ఇంకెన్ని దశాబ్ధాలు పడుతుంది అని కన్నబాబు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కళ్లబొల్లి మాటలు, పబ్లిసిటీతో రెండేళ్లుగా చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నాడు. శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ రాజధాని కట్టకూడదు అని సూచించిందో చంద్రబాబు అదే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. రాజధాని పేరుతో వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడు. వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ మోడల్తో ఆయన అవినీతి ఆశలు కుప్పకూలిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. ఏం చేయాలో అర్థంకాక వైయస్సార్సీపీ నాయకులను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. మమ్మల్ని దూషించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు.
అమరావతిలో అవినీతికే చట్టబద్ధత తెచ్చారు – గుడివాడ అమర్
జగన్ సూచించిన మావిగన్ పేరుకు వ్యతిరేకమా? లేక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో రాజధాని ఏర్పాటు చేయడానికి వ్యతిరేకమా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. జగన్ గారు సూచించిన మావిగన్ మోడల్లో పోర్టు, ఎయిర్పోర్టు, నేషనల్ హైవేలు అన్నీ ఉన్నాయి. కానీ అమరావతిలో ఇవన్నీ వేల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. అమరావతికి చట్ట బద్ధత తీసుకొచ్చామని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, దేశంలో ఏ రాష్ట్రానికి ఈ విధంగా చట్టబద్ధత తెచ్చారో చెప్పాలి. చంద్రబాబు తెచ్చిన చట్టబద్ధత అమరావతి రాజధానికి కాదు.. అమరావతి ముసుగులో చేస్తున్న అవినీతికి అని గుడివాడ అమర్ మండిపడ్డారు.
