శ్రీ సత్యసాయి సదన్ లో ఘనంగా మహాశివరాత్రి మహోత్సవాలు
– సహస్ర లింగార్చన సహిత ఏకాదశ రుద్రాభిషేకం
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపాకటాక్షాలతో, పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలోని శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో సిటీ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం ద్వారా కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మహన్యాసం ఘనంగా నిర్వహించబడింది. మహన్యాసం జరుగుతున్న సమయంలో భక్తులకు పార్థివ లింగాల తయారీ చేసే అరుదైన అవకాశం లభించింది. సహస్ర లింగార్చన సహిత ఏకాదశ రుద్రాభిషేకం భక్తి పరవశంతో నిర్వహించబడింది. రుద్రమ్ ఘోషలతో మందిర ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. అనంతరం బిల్వార్చన, కుంకుమార్చన మరియు రుద్ర హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. సాయంత్రం పార్వతి పరమేశ్వర కళ్యాణం వైభవంగా నిర్వహించబడింది. తరువాత పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ భక్తులను దివ్యానుభూతికి చేర్చాయి. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి అఖండ నామసంకీర్తనం నిర్వహించబడగా, అర్ధరాత్రి సుమారు 12 గంటలకు సయీశ్వర లింగానికి అభిషేకం నిర్వహించడం ద్వారా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ మహోత్సవం ద్వారా భక్తులు అపారమైన ఆనందం, ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు దివ్యానుభూతిని అనుభవించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వేదం గ్రూప్ సభ్యుల, జిల్లా అధ్యక్షులు పిన్నింటి ఆర్ ఎస్ ఎన్ నాయుడు, సిటీ సేవా సమితి కన్వీనర్ బి సాయి కుమార్, వందలాది మంది భక్తులు, సిటీ సమితి గాయనీ గాయకులు, పదాధికారులు భక్తితో పాల్గొన్నారు.
