దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం
` కొనియాడిన సీపీ శంఖబ్రత బాగ్చీ
సామాజిక సమతామూర్తి డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని నగర పోలీసు కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా నగర పోలీసు కమిషనరేట్లో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి , ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ కీర్తి కిరీటంలో అలుపెరగని పోరాట యోధుడిగా, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన సామాజిక విప్లవకారుడని కొనియాడారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత ప్రస్థానం భారత దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. కుల వివక్ష, సామాజిక అంటరానితనం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదిరించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన పట్టుదల నేటి తరానికి గొప్ప పాఠమని అభివర్ణించారు. దేశాభివృద్ధిలో బాబూజీ పోషించిన పాత్ర అద్వితీయమని పేర్కొంటూ, రక్షణ మంత్రిగా 1971 యుద్ధంలో ఆయన ప్రదర్శించిన ధీరత్వం మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా దేశాన్ని ఆహార సంక్షోభం నుండి గట్టెక్కించిన హరిత విప్లవం ఆయన మేధస్సుకు నిదర్శనాలని సీపీ గుర్తు చేశారు. అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన చట్టాలు, తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ సామాజిక న్యాయానికి పునాదులుగా నిలిచాయని వివరించారు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కాకుండా, దేశంలోని కార్మిక, కర్షక, మరియు అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన సమతా మూర్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు.
