భవిష్యత్తు తరాల కోసం విత్తన గ్రామాలను అభివృద్ధి చేద్దాం
– జల వనరులు కోసం శ్రమదానం చేస్తున్న ఆదివాసీలు
– మన జీవవైవిధ్యాన్ని మనమే కాపాడుకుందాం
– డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సిఫా ట్రస్ట్
ప్రతి నీటి చుక్కనీ ప్రకృతి ఆధారిత పంటల కోసం వినియోగిద్దాం అని సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతపల్లి మండలం నూతిబంద గ్రామంలో బుధవారం ఉదయం ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జల వనరులు కోసం శ్రమదానం చేస్తున్న ఆదివాసీలను అభినందించారు. గ్రామస్తులు అందరూ శ్రమదానం చేసి చెక్ డ్యాం లు నిర్మించడం అభినందనీయం అన్నారు. అలాగే ప్రతి పొలం లో అయిదు శాతం భూమి లో గొయ్యి తవ్వి నీరు నిలబెట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. అలా చేసిన వారికి చేప పిల్లలను ఇస్తామన్నారు. ఇదే రీతిలో అందరూ భవిష్యత్తు తరాల కోసం విత్తన గ్రామాలను అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు. మన దేశీయ విత్తనాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలి అని వివరించారు. నిర్మించిన చెక్ డ్యాం లు ఆధారంగా వచ్చే నీటిని వినియోగించి సంవత్సరం పొడవునా పంటలు పండించడం అవసరం అని పేర్కొన్నారు. లాభాలు వచ్చే విధంగా దేశీయ విత్తనాల ద్వారా పంటలు పండించడం వల్ల ఆదాయం పెరుగుతుంది అని వివరించారు. మన జీవవైవిధ్యాన్ని మనమే కాపాడుకుందాం అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఫా ట్రస్ట్ ప్రతినిధులు త్రిమూర్తులు, జూన్ బాబు, నూతిబంద గ్రామస్తులు పాల్గొని మాట్లాడారు
