స్థానిక అసోసియేషన్లకు జీవీఎంసీ పార్కుల నిర్వహణ: గంటా స్వతంత్ర నగర్ కాలనీలో అనేక ఏళ్లుగా నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు న్యాయం చేసేలా శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. స్వతంత్ర నగర్ పార్కును.. దాన్ని ఆనుకున్న ప్రభుత్వ స్థలంలోని ఇళ్లను గురువారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2014-19 మధ్యలో తాను మంత్రిగా ఉన్నప్పుడు 30 మందికి ఇళ్ల పట్టాలిచ్చినట్టు చెప్పారని పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా ఇళ్ల పట్టాలివ్వాలని అడుగుతున్న నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై జోనల్ కమిషనర్ ను నివేదిక అందజేయాలని ఆదేశించానన్నారు. చాలా ఏళ్లుగా నివాసాలు ఏర్పరుచుకుని, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించామని, వారిని ఖాళీ చేయించడం కూడా సాధ్యం కాదన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొంటామని తెలిపారు. 6 వ వార్డులోని యోగా థీమ్ పార్కును స్థానిక అసోసియేషన్ సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసిస్తూ.. అదే బాటలో 5, 6, 7, 8 వార్డుల్లోని జీవీఎంసీ పార్కుల నిర్వహణ కూడా స్థానికంగా ఉన్న అసోసియేషన్ లకు అప్పగించనున్నట్టు చెప్పారు. అన్ని పార్కులలోనూ విధిగా ప్రాధమిక వసతులు సమకూర్చాలన్నారు. జోనల్ కమిషనర్ వి. అయ్యప్ప నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతిరాజు, ఏసీపీ శాస్త్రి, కూటమి నాయకులు క్కాల విజయ్ బాబు, పిల్లా వెంకట్రావు, మొల్లి లక్ష్మణరావు, గరే గుర్నాథ్, కె.అచ్యుతరావు, చెట్టిపల్లి సన్యాసిరావు, వాండ్రాసి అప్పలరాజు, బోయి రమాదేవి, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర నగర్ కాలనీ పేదలకు న్యాయం
RELATED ARTICLES
