Wednesday, May 6, 2026
HomePoliticsAndhra Pradeshహోటల్స్ బంద్..!

హోటల్స్ బంద్..!

గ్యాస్ కొరత తీవ్ర తరం

మహా నగరాల్లో క్లోజ్ బోర్డులు

దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ కొరత తీవ్రరూపం దాల్చుతోంది. కేంద్ర ప్రభుత్వం నిల్వలు సరిపడా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే కర్నాటలో రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు మూసేశారు. మార్చి 10 మంగళవారం బెంగళూరులో హోటళ్లు బంద్‌కు పిలుపునిచ్చింది అక్కడి హోటల్స్‌ అసోసియేషన్. ఇప్పుడు ముంబైకూడా అదే బాట పట్టింది. వాణిజ్య రాజధాని ముంబైలో గ్యాస్ అందక ఇప్పటికే 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉంది. కేవలం ముంబై మాత్రమే కాకుండా ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వంటగ్యాస్ లభ్యత లేకపోవడంతో అనేక చోట్ల హోటళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. ఈ కొరతను అదునుగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విక్రయాలు ఊపందుకున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను బ్లాక్‌లో రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సామాన్య వ్యాపారులు తీవ్ర ఆర్థిక భారానికి గురవుతున్నారు. దీంతో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. భారతదేశం ఏటా వినియోగించే 31.3 మిలియన్ టన్నుల వంటగ్యాస్‌లో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం దిగుమతులపై ప్రభావం చూపింది. అయితే, దేశంలో ప్రస్తుతం తగినన్ని నిల్వలు ఉన్నాయని, పెట్రో ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. చమురు సంస్థలు వెంటనే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించకపోతే, ఆహార రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments