సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లాంగ్వేజ్ ఫెస్టివల్స్ కార్యక్రమంలో భాగంగా గురువారం చోడవరం నియోజకవర్గం పరిధిలో గల రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎస్సే రైటింగ్ పోటీలు, క్విజ్ పోటీలు, డిబేట్ పోటీలు, కాన్వర్సేషన్ స్కిట్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. అలాగే మ్యాగజైన్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్ కార్యకలాపాలు, నిర్వహించి విద్యార్థుల్లో వినడం, మాట్లాడడం, చదవడం, వ్రాయడం వంటి నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు తీసుకున్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి.వి. శేషగిరిరావు మాట్లాడుతూ, ఇంగ్లీష్ భాష ప్రస్తుత ప్రపంచంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన భాష అని, విద్యార్థులు భాషపై పట్టు సాధించడం ద్వారా ఉన్నత అవకాశాలను పొందగలరని తెలిపారు.
ఆంగ్ల ఉపాధ్యాయులు పి.వి.ఎం. నాగజ్యోతి మాట్లాడుతూ భాష ప్రాముఖ్యతను వివరించారు.ముఖ్యంగా ఫోనెటిక్స్ వంటి విషయాలను నేర్చుకోవడంలో భాషలో స్పష్టత ఎంత అవసరమో తెలిపారు. ఇంగ్లీష్ ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా ప్రపంచవ్యాప్తంగా సంభాషణకు వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాక్టివిటీస్ ఎంతగానో సహాయపడతాయని వివరించారు.
సిఆర్పి సతీష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
లాంగ్వేజ్ ఫెస్టివల్స్ ద్వారా విద్యార్థుల్లో భాషాపట్ల ఆసక్తి పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరిగేలా పాఠశాల యాజమాన్యం చర్యలు చేపట్టింది.
