ప్రపంచ రవాణా రంగంలో సాంకేతిక అద్భుతంగా నిలిచిన షాంఘై అయస్కాంత రైలు చైనా దేశంలోని షాంఘై నగరంలో నడుస్తోంది. గరిష్టంగా గంటకు సుమారు నాలుగు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వాణిజ్య రీతిలో నడుస్తున్న రైలుగా ఇది పేరు గడించింది. ఈ రైలుకు ప్రధాన విశిష్టత అయస్కాంత ఉత్తేజన విధానం. సాధారణ రైళ్లలో చక్రాలు పట్టాలపై తిరుగుతాయి కానీ ఈ రైలులో చక్రాలు ఉండవు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో రైలు పట్టాలపై కొద్దిపాటి ఎత్తులో తేలియాడుతుంది. దీనివల్ల ఘర్షణ దాదాపుగా ఉండదు. ఘర్షణ లేకపోవడంతో వేగం ఎక్కువగా సాధ్యమవుతుంది శబ్దం కూడా చాలా తక్కువగా ఉంటుంది. షాంఘై నగరంలోని లాంగ్యాంగ్ రోడ్డు ప్రాంతం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఏడు నుండి ఎనిమిది నిమిషాల్లో ఈ రైలు పూర్తిచేస్తుంది. సాధారణ రవాణా మార్గాల్లో ఇంత వేగం అసాధ్యం. అత్యంత వేగవంతమైన ప్రయాణం ద్వారా సమయం మించి విలువైనదని ఈ ప్రయోగం నిరూపిస్తోంది.
వేగంతో నడుస్తున్నప్పటికీ భద్రత విషయంలో కఠిన ప్రమాణాలు అమలులో ఉన్నాయి. గణన యంత్రాల ద్వారా నియంత్రించే వ్యవస్థలు స్వయంచాలక నియంత్రణ అత్యవసర నిలుపు పద్ధతులు వంటి సదుపాయాలు ఉన్నాయి. వర్షం గాలి వేగం వంటి ప్రకృతి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించే సాంకేతిక పరికరాలు కూడా అమర్చబడ్డాయి. రైలు అంతర్గత నిర్మాణం ఎంతో ఆధునికంగా ఉంటుంది. విశాలమైన ఆసనాలు సమాచార ప్రదర్శనలు సౌకర్యవంతమైన వాతావరణ నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. వేగం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణికులు తక్కువ ప్రకంపనలను మాత్రమే అనుభూతి చెందుతారు. ఇంధనాన్ని కాల్చకుండా విద్యుత్ ఆధారంగా నడవడం వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది. శబ్ద కాలుష్యం కూడా ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్తు రవాణా పద్ధతులకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తోంది.
భూమికి ఆనుకోకుండా గాలిలో ప్రయాణించే ఈ వింత రైలును చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. సాధారణ రైలు పట్టాల పైన ఉండే ఒత్తిడి ఈ అయస్కాంత పట్టాలపై ఉండదు కాబట్టి నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సాంకేతికతను ఇతర దేశాలు కూడా తమ నగరాల్లో ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. వేగం భద్రత సౌకర్యం పర్యావరణ పరిరక్షణ అనే నాలుగు అంశాల సమ్మేళనమే ఈ రైలు విజయానికి కారణం. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో కీలకమైనవి. మారుతున్న కాలంతో పాటు రవాణా వ్యవస్థలో వస్తున్న మార్పులకు ఈ అయస్కాంత రైలు ఒక నిలువుటద్దం. ప్రకృతి వనరులను వాడుకుంటూనే పర్యావరణాన్ని కాపాడుకునే ఇలాంటి మార్గాలు మానవజాతి అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి.
ఈ రైలు ప్రాజెక్టును జర్మనీ సాంకేతిక సహాయంతో చైనా నిర్మించింది. దీని రూపకల్పనలో వాడిన విజ్ఞానం అత్యంత క్లిష్టమైనది. పట్టాలకు రైలుకు మధ్య ఘర్షణ లేకపోవడం వల్ల వేగంగా వెళ్లేటప్పుడు కలిగే వేడి సమస్య కూడా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వేల కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ సమయంలో దాటడానికి ఈ సాంకేతికత పునాది వేస్తుంది. విమాన ప్రయాణంతో పోటీ పడే స్థాయికి రైలు ప్రయాణాన్ని తీసుకువెళ్లడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. కేవలం రవాణా కోసమే కాకుండా పర్యాటక రంగ అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇలాంటి అతివేగవంతమైన రవాణా వ్యవస్థల కోసం పరిశోధనలు చేస్తున్నాయి. జపాన్ మరియు ఇతర ఐరోపా దేశాలు కూడా ఇదే తరహా ప్రయోగాలను మరింత విస్తృతం చేస్తున్నాయి. భారతదేశం వంటి అధిక జనాభా గల దేశాలలో నగరాల మధ్య దూరాన్ని తగ్గించడానికి ఇలాంటి అత్యాధునిక రవాణా మార్గాలు ఎంతో అవసరమవుతాయి. అత్యంత వేగంగా గమ్యాన్ని చేరుకోవాలనుకునే వారికి ఈ రైలు ప్రయాణం ఒక మరపురాని అనుభూతిని మిగిలిస్తుంది. రవాణా రంగంలో చైనా సాధించిన ఈ ప్రగతి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. సాంకేతికత సామాన్యుడికి చేరువైనప్పుడే దేశ ప్రగతి వేగవంతమవుతుంది.
(సి.హెచ్.ప్రతాప్)
