శ్రీ చిన్న జీయర్ స్వామీజీకి ఆహ్వానం మిషన్ కర్షకదేవోభవ జాతీయ చైర్మన్ డా. ఆడారి కిషోర్ కుమార్మిషన్ కర్షకదేవోభవ జాతీయ చైర్మన్ డా. ఆడారి కిషోర్ కుమార్, శ్రీ చిన్నజీయర్ స్వామీజీ గారి ‘సుఫల’ పాదయాత్ర సందర్భంగా, ఫిబ్రవరి నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్న రైతు–యువజన మహాసభకు స్వామీజీని అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డా. ఆడారి కిషోర్ కుమార్ మిషన్ కర్షకదేవోభవ లక్ష్యాలు, కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను స్వామీజీకి వివరించారు. ముఖ్యంగా కళాశాలలు, గ్రామీణ సముదాయాలు, రైతు సంఘాలు, యువత మధ్యకు వెళ్లి సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచే విధంగా ఆర్థిక, పర్యావరణ అనుకూల విధానాలను ప్రోత్సహించడం వంటి అంశాలను స్వామీజీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, రైతులు–విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ, వ్యవసాయాన్ని లాభదాయక వృత్తిగా తీర్చిదిద్దేందుకు మిషన్ కర్షకదేవోభవ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమాలపై రూపొందించిన పాంప్లెట్లోని ముఖ్యాంశాలను శ్రీ చిన్నజీయర్ స్వామీజీ ఆసక్తిగా పరిశీలించి ప్రశంసించారు.
స్వామీజీ మాట్లాడుతూ, సహజ వ్యవసాయం, రైతు సంక్షేమం, యువతలో వ్యవసాయంపై ఆసక్తి పెంపొందించడం వంటి అంశాలు అత్యంత ప్రాధాన్యత కలవని పేర్కొంటూ, విశాఖలో నిర్వహించనున్న రైతు–యువజన మహాసభకు తాను తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు.
ఈ మహాసభ ద్వారా రైతులు, విద్యార్థులు, యువత ఒకే వేదికపైకి వచ్చి వ్యవసాయ భవిష్యత్తుపై చర్చించడంతో పాటు, సహజ వ్యవసాయ అవకాశాలను అన్వేషించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని డా. ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు.
విశాఖ కేంద్రంగా ఫిబ్రవరిలో రైతు–యువజన మహాసభ
RELATED ARTICLES
