నిరాశ్రయులకు ఉచిత వైద్య సేవలు
– ప్రారంభించిన విశాఖ సీపీ శంఖ బ్రత బగ్చీ
విశాఖపట్నం, ఏప్రిల్ 7, జయ జయహే : లక్ష్మీగాయత్రి పేరిట ట్రస్టు, ఆస్పత్రి ప్రారంభించి 600వరకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించిన డాక్టర్ కాండ్రేగుల వెంకట రామ్కుమార్ సేవలు అభినందనీయమని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బగ్చీ కొనియాడారు. అక్కయ్యపాలెం లక్ష్మీ గాయత్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఉన్న నిరాశ్రయ గృహంలో ఉచిత వైద్య సేవల్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి నెలా పేదల ఆరోగ్యం కోసం శిబిరాల్ని ఏర్పాటు చేసి, ఉచితంగా వైద్యం, మందులు అందజేస్తున్న రామ్కుమార్ను అభినందించారు. ఈ సారి ప్రత్యేకంగా నిరాశ్రయుల కోసం డాక్టర్ రామ్కుమార్ 20 బియ్యం బస్తాల్ని కూడా అందజేయడం పేదల పట్ల వారికి ఉన్న ఔదార్యం తెలియజేస్తుందన్నారు. ఇలా
ప్రతి నెల కూడా 20 బియ్యం బస్తాలని ఇస్తామని డాక్టర్ రామ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆపరేషన్ జ్యోతిర్గమయ’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి మందుల్ని అందుబాట్లో ఉంచడంపై పేదలు కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలు, వృద్ధులు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించొచ్చని, మందులు నిత్యం అందుబాట్లో ఉంటాయని ఈ సందర్భంగా రామ్కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీగాయత్రి ఆస్పత్రి డ్యూటీ డాక్టర్ రమేష్, ఆనంద్, జనసేన పార్టీ డాక్టర్స్ సెల్ ప్రతినిధి వాకా సునీత, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
