` వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్
ఇంజనీరింగ్ పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడాల్సిన పని లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం సమావేశ మందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పని చేయాలన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించామని, అందువల్ల ఉద్యోగులంతా తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని ఆదేశించారు. తద్వారా సంస్థ పేరుని ఇనుమడింపచేయాలని కోరారు. ప్రధానంగా పర్యాటక ప్రాంతాల్లో అన్ని ప్రాజెక్టులు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రహదారులు నిర్మాణం, కార్యాలయ నిర్వహణ ఇలా అన్నింటినీ నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనకి సంబంధించి సమీక్షించారు. పనుల స్థితిని తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసేందుకు ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్ ఈ లు భవాని శంకర్, మధు, ఈ ఈ లు, డి ఈ లు, ఎ ఈ లు పాల్గొన్నారు.
