పాత బకాయిలు చెల్లింపులు కోసం 21 రోజులుగా పస్తులతో గోవాడ ఫ్యాక్టరీ వద్ద నిరసనలు చేస్తున్న, కార్మికులు కర్షకుల ఆకలి గోడు పట్టదా కూటమి ప్రభుత్వానికి అని ఏ.పీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రైతుల, కార్మికుల బకాయిల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెట్టిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించి, నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు,కార్మిక సంఘాలు, అఖిల పక్షాలు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద చేస్తున్న నిరసనలు గురువారంతో 21వ రోజుకు చేరుకున్నాయి. టిడిపి, జనసేన రాజులు అండ్ కో రోజుకో డ్రామా ఆడుతూ కార్మికులు, కర్షకుల కుటుంబాలను నమ్మించి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గోవాడ ఫ్యాక్టరీ లో చెరకు క్రషింగ్ ప్రారంభించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పి. రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్ రావు, ఫ్యాక్టరీ కార్మిక సంఘం యూనియన్ నాయకులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబుల ఏ. పి. చెరుకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేచలపు వెంకటరమణ గోవాడ జనసేన నాయకులు యేడువాక శ్రీనివాసరావు, రైతులు ఏడువాక శ్రీరాములు, తదితరులు మాట్లాడారు.
కార్మికులు, కర్షకుల ఆకలి గోడు పట్టదా ఈ ప్రభుత్వానికి ?
RELATED ARTICLES
