– ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేశారో చెప్పండి
– కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
చేసిన అప్పులకు లెక్కలు చెప్పే దమ్ముందా అని కూటమి నేతలను ఎమ్మెల్సీ కుంభా రవి బాబు ప్రశ్నించారు.
విశాఖలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం అయన మీడియాతో మాట్లాడుతూ ఆదాయ వృద్ధిలో దేశంలోనే అట్టడుగున ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. 2 శాతం కూడా లేని రెవెన్యూ వృద్ధితో 11.09 శాతం జీఎస్డీపీ సాధ్యమా అని ప్రశ్నించారు. 20 నెలల్లోనే రాష్ట్ర అప్పులు రూ. 3.28 లక్షల కోట్లకు పైమాటే చేశారని, వైయస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.3.39 లక్షల కోట్లు గా వివరించారు. డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల రూపంలో రూ.2.75 లక్షల కోట్లు జమ చేసిన వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఐదేళ్లలో చేసిన అప్పును 20 నెలల్లోనే చేరిన చంద్రబాబును ఏమనుకోవాలని కడిగేసారు. అయినా అభివృద్ధి జాడ లేదు.. సంక్షేమ పథకాల ఊసేలేదన్నారు. గత 20 నెలల్లో సూపర్ సిక్స్లో ఏ ఒక్క పథకమూ అమలు కాలేదని, వైయస్సార్సీపీ హయాంలో గ్రామ సచివాలయాలు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, సాగునీటి ప్రాజెక్టులు, విలేజ్ క్లీనిక్, ఆర్బీకే సెంటర్లు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణంతో సంపద సృష్టి చేసిందన్నారు. అయితే ష్యూరిటీ ఇచ్చి మరీ వంచించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేసిందేమిటో అందరికి తెలిసిందని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ వృద్ధిలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని కాగ్ లెక్కలు చెబుతుంటే.. 11.09 శాతం జీఎస్టీడీపీ వృద్ధి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. 20 నెలల్లోనే రూ.3.28 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు.. ఐదేళ్లలో వైయస్సార్సీపీ చేసిన అప్పులను చేరుకున్నారని.. కానీ సూపర్ సిక్స్లో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా రూ. 14 లక్షల కోట్లు అప్పులయ్యాయని కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు వారే బడ్జెట్ సాక్షిగా వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ. 3.39 లక్షల కోట్లేనని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైయస్సార్సీపీ హయాంలో పొదుపుగా పాలన చేసి గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లీనిక్లు, ఆర్బీకే సెంటర్లు, ఇళ్ల నిర్మాణం, పోర్టులు, మెడికల్ కాలేజీలు.. తదితర నిర్మాణాలతో సంపద సృష్టించడం జరిగిందని, కానీ ఆదాయం సృష్టించి అప్పులు తీర్చేస్తామని చెప్పిన చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడని కుంభా రవిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
● అప్పులు చేయడంలోనే వృద్ధి
వైయస్సార్సీపీ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రూ.14 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూటమి నాయకులు తమకు ఇష్టమొచ్చినట్టు అసత్య ప్రచారం చేశారు. మేం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రం అప్పులు తీర్చేస్తామని నమ్మబలికారు. వారి అబద్ధపు హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను పూర్తిగా వంచించారు. సంపద సృష్టించడం పక్కన పెడితే 20 నెలల్లోనే రూ.3.28 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో వార్షికాభివృద్ది కేవలం 1.97 శాతమే అయినా 11.09 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించామని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా జీఎస్టీడీపీ ఎలా పెరుగుతుందని అడిగితే వారి వద్ద సమాధానం లేదు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏయే విభాగాలకు ఎంతెంత ఖర్చు చేశారో సభ ముందుంచాల్సిన ప్రభుత్వం దానికీ సమాధానం చెప్పడం లేదు. గతేడాది రాష్ట్ర పన్నులు పన్నేతర ఆదాయం అంచనాలు రూ. 1,25,126 కోట్లు కాగా, సవరించిన అంచనాల ప్రకారం రూ. 1,11,860 కోట్లకు తగ్గించారు. మొదటి 9 నెలల్లో వచ్చిన ఆదాయం రూ. 67,459 కోట్లు మాత్రమే. మిగిలిన మూడు నెలల్లో రూ. రూ.44,407 కోట్లు రావాలి. ఈ 9 నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఈ మూడు నెలల్లో రెట్టింపు ఆదాయం రావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? గతేడాది కూడా పన్నుల్లో వచ్చిన వృద్ధి రేటు కేవలం 3.4 శాతం మాత్రమే. కానీ ప్రజలకు మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది రూ.3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టి ద్రవ్యలోటును రూ.78,868 కోట్లుగా, రెవెన్యూ లోటును రూ. 22 వేల కోట్లు చూపించి భారీగా అప్పులు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రధాన రాష్ట్రాల్లో ఆదాయ పెరుగుదల రేటు ఏ విధంగా ఉందని కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే అందులో చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున ఉంది. అస్సాం, బీహార్ రాష్ట్రాలు కూడా ఏపీ కన్నా ముందు వరుసలో ఉండటం చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిది.
