రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న “దివ్యాంగ శక్తి” ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలులో ఘనంగా ప్రారంభించారు. పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు సెంటర్ వద్ద పచ్చ జెండా ఊపి బస్సు సేవలను ప్రారంభించిన ఆయన, దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి తొలి ‘జీరో టికెట్’ను అందజేశారు.
ఈ పథకం ద్వారా నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం 4,436 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీ సిటీ ఆర్డినరీ నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల వరకు 100% ఉచిత ప్రయాణం, అలాగే కొన్ని సేవల్లో 50% రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సహాయకులకు కూడా టికెట్ ధరలో సగం రాయితీ ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకుంటోందని, దేశంలోనే అత్యధికంగా రూ. 6,000 పింఛన్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దివ్యాంగులతో కలిసి భోజనం చేసి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపగా, మంత్రి ప్రజలకు ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
