ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలంటూ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఫలితం దక్కింది. సోమవారం దీక్ష ప్రారంభించిన జేఏసీ నాయకులకు జాయింట్ కలెక్టర్ కార్యాలయం నుంచి చర్చలకు పిలుపు రావడంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. ఐ&పిఆర్, డీపీఆర్ఓ, ఆర్డీఓ సమక్షంలో ఇరువర్గాల నుంచి ఐదుగురు చొప్పున ప్రతినిధులతో బుధవారం సాయంత్రం చర్చలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో దీక్ష శిబిరం వద్ద రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అధికారులు వెంటనే స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఎన్నికలు నిర్వహించడం, గత ఏడేళ్ల ఆర్థిక లావాదేవీలపై విచారణ, అర్హులందరికీ సభ్యత్వాలు కల్పించాలంటూ జేఏసీ డిమాండ్లు వినిపిస్తోంది. జేఏసీ తరఫున అబ్రహం లింకన్, నమ్మి శీను, కిరణ్ కుమార్ రాజు తదితరులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. విఆర్ఓ నాగేశ్వరరావు సమక్షంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసి శాంతియుతంగా చర్చలకు హాజరుకావాలని అధికారులు సూచించారు.
