Home News ఆరోపణలు నిరూపించకుంటే పరువు నష్టం దావా

ఆరోపణలు నిరూపించకుంటే పరువు నష్టం దావా

0

సురగాల ఉమామహేశ్వరరావు
-​ఎమ్మెల్యే విజయ్‌చంద్ర వ్యాఖ్యలపై బీజేపీ నేత ధ్వజం
తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే బొనేల విజయ్‌చంద్ర తీరుపై బీజేపీ నేత సురగాల ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో పత్రిక ముఖంగా స్పందించారు. మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను సవాల్ చేశారు. తనపై 200 కేసులు ఉన్నాయని, ఊరు నుంచి బహిష్కరణకు గురయ్యానని ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, అయితే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే తుడుచుకోవడానికి నేనేమీ అల్లాటప్పా వ్యక్తిని కాదని, రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని” పేర్కొన్నారు.
తనపై చేసిన ఆరోపణలను తక్షణమే నిరూపించాలని, లేనిపక్షంలో న్యాయపరంగా నోటీసులు పంపించి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యే తీరుపై ఇప్పటికే టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తడతానని వెల్లడించారు.
​కబ్జాలపై విచారణ ఏది?
నియోజకవర్గంలో జరుగుతున్న భూ కబ్జాలపై ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని సురగాల విమర్శించారు. గిరిపట్నాయక్ లేఅవుట్, శుభమస్తూ కళ్యాణ మండపం వంటి వివాదాస్పద స్థలాల విషయంలో అధికారులను ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అయిన రెండేళ్లలోనే సుమారు మూడు కోట్ల విలువైన ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో కక్షసాధింపు రాజకీయాలకు తెరలేపి, భయానక వాతావరణం సృష్టించడం తగదని హితవు పలికారు. తన ప్రాణాలకు ఎమ్మెల్యఅతని అనుచరుల నుండి ముప్పు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో తనకు ఏ చిన్న హాని జరిగినా దానికి ఎమ్మెల్యే విజయ్‌చంద్రే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version