రాళ్లు, కర్రలతో కొట్లాట గ్రామంలో పోలీస్ పికెట్ ప్రభుత్వ భూముల్లో అకేషియా మొక్కల నరికివేతకు సంబంధించి మంగళవారం పెద్దమదీనాలో నిర్వహించిన గ్రామసభ తీవ్ర ఉద్రిక్తతకు,గొడవలుకి దారితీసింది.మొక్కలు నరికివేయాలని జనసేన వర్గీయులు, వద్దని టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు.ఇది ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డీఎస్పీ శ్రావణి,సీఐ కోటేశ్వరరావు, స్థానిక ఎస్ఐ ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.పెదమదిన రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 81లో సుమారు 40 ఎకరాల్లో సామాజిక అటవీశాఖ అధికారులు గతంలో అకేషియా మొక్కలు నాటించారు. దీనిపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీకి జమచేసి గ్రామాభి వృద్ధి కోసం వినియోగించాలి.పది రోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు పెద్దలు కూలీలతో చెట్లను నరికించి కాటాలకు తరలిస్తుండగా టిడిపికి చెందిన మాజీ సర్పంచి వియ్యపు అప్పారావు అధికారులకు ఫిర్యాదు చేశారు.తహసీల్దారు లక్ష్మి ఆదేశాలతో నాడు పోలీసులు అక్కడకు చేరుకుని చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. వేలం నిర్వహించి ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి వినియోగించాలని ఫిర్యాదుదారు అప్పారావు కోరారు.ఈ నేపథ్యంలో మంగళవారం అనధికారికంగా గ్రామ పెద్దలందరూ గ్రామసభ నిర్వహించారు.గ్రామసభ ప్రారంభంలో టిడిపి, జనసేన వర్గీయుల మధ్య చెట్ల నరికివేత పై వాగ్యుద్ధం పెరిగింది.ఇది ఘర్షణకు దారితీసింది. టిడిపి,జనసేన వర్గీయులు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు,కర్రలతో భౌతిక దాడులకు పాల్పడ్డారు.ఈ దాడిలో చిరంజీవి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.గ్రామసభకు వచ్చిన ప్రజలు,పోలీసులు సైతం భయభ్రాంతులకు గురయి పరుగులు తీశారు.ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి మరి దాక్కున్నారు.రెండు వర్గాల నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
