ఏటా ప్రతి లక్ష మంది పిల్లల్లో 12-15 మందికి క్యాన్సర్
లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంబాబు
బాల్య క్యాన్సర్ ప్రాణాంతక సమస్య కాదని, తల్లిదండ్రులు భయపడకుండా ఉండటం ఎంతో ముఖ్యమని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, గొప్పిశెట్టి మురళి కృష్ణ అన్నారు. అంతర్జాతీయ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 4 ఏళ్ల బాలుడు విహంత్ అర్జున్ కు నెలకు సరిపడే మందులు, ప్రోటీన్స్, పండ్లు అందించారు. వారు మాట్లాడుతూ బాల్య క్యాన్సర్లు చికిత్సలకు లొంగుతాయని, పిల్లల శరీరం కీమోథెరపీ వంటి చికిత్సలను సమర్థంగా తట్టుకుంటుందన్నారు. సమయానికి చికిత్స చేస్తే నయమయ్యే అవకాశం ఎక్కువ ఉన్నాయని, పిల్లల్లో ధైర్యాన్ని నింపి, మూడు నాలుగు నెలలు చికిత్స చేస్తే మామూలుగా అవుతారన్నారు. మన దేశంలో ఏటా ప్రతి లక్ష మంది పిల్లల్లో సుమారు 12-15 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, ఒకప్పుడు పిల్లల్లో క్యాన్సర్ అనగానే దాదాపు ఆశలు వదులుకునే వారని, అధునాతన చికిత్సల పుణ్యమాని ప్రస్తుతం పరిస్థితి గణనీయంగా మెరుగైందన్నారు. 80-85 శాతం బాల్య క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నారని,సత్వరం గుర్తించి,సరైన చికిత్స చేయించడం కోసం దాతలు కూడ సహకరించాలి అన్నారు.కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి కనగర్ల రామకృష్ణ, పావిరాల రామ మోహన్ రావు, మహమ్మద్ సరోజినీ,షేక్ పాదుషా,
భట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు..
