తిప్పి కొడదాం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
వ్యాక్సి నేషన్ రూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే
క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోందని, దాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషిచేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధిని అరికట్టే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి రూమ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హెచ్పివి వ్యాక్సిన్ వైల్ మానిటర్ – వివిఎమ్ రంగును స్వయంగా పరిశీలించి, వ్యాక్సిన్ స్థాయిని తెలుసుకున్నారు. వ్యాక్సిన్కు సంబంధించిన వివరాలను పవర్ పేట యూపిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమ్ రాజు ఎమ్మెల్యేకు వివరించారు. తదనంతరం పద్నాలుగేళ్ళు నిండిన బాలికలకు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో వైద్య సిబ్బంది హెచ్పివి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని అరికట్టే ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పద్నాలుగేళ్ళు నిండిన బాలికలకు భవిష్యత్తులో క్యాన్సర్ నుండి ఎటువంటి ముప్పు వాటిల్లకూడదనే సదుద్దేశంతో హెచ్పివి వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. బయట 6వేల రూపాయలు నుండి రూ 10వేల ధర ఉండే హెచ్పివి వ్యాక్సిన్ను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీన్ని అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు శ్రద్ధచూపాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట ఏపి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, కార్పొరేటర్ యర్రంశెట్టి సుమన్, టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు ఉన్నారు.
