కేవలం ఓటు అనే ఆయుధం ద్వారానే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని భారతీయ జనతా పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు, మఠం సర్పంచ్ మఠం శాంత కుమారి పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు పై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సీనియర్ సిటిజన్ ను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాంత కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే ఆయుధం గురించి అవగాహన పరుచుకోవలసిన అవసరం ఉందన్నారు. నవ సమాజ నిర్మాణంలో ఓటర్లే కీలక భూమిక పోషిస్తారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. దుర్మార్గపు పార్టీలు దుర్లభమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులు సమాజాన్ని విధ్వంసం చేస్తున్నారని వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలన్నారు. ఓటు ఒక్క దానికే సమాజాన్ని వ్యవస్థల్ని మార్చే సామర్థ్యం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ఓటు వేసి అవకాశం ఎప్పుడు వచ్చినా మీరు ఓటు వేసే వ్యక్తి గురించి అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ఓటు వేయాలన్నారు. పోటీ చేసిన వ్యక్తి సమాజానికి ఊరుకో, వాడకో ఉపయోగపడతాడనుకుంటేనే ఆయనను ఎన్నుకోవాలని సూచించారు. ఓటు ఎంత కీలకమైందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని మన తలరాతలను మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
