Wednesday, June 17, 2026
HomePoliticsAndhra Pradeshబీహార్ ఐజీ సునీల్ నాయక్ అరెస్టు

బీహార్ ఐజీ సునీల్ నాయక్ అరెస్టు

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో అదుపులోకి

బీహార్ లో మెరుపు దాడులు చేసిన ఆంధ్రా పోలీసులు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించినట్లు నమోదైన ‘థర్డ్ డిగ్రీ’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకున్నారు. బిహార్ రాష్ట్రంలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న సునీల్ నాయక్‌ను పట్టుకునేందుకు ఏపీ పోలీసుల బృందం పట్నా వెళ్ళింది. గత కొంతకాలంగా ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతో పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

కేసు నేపథ్యం ఇదీ..

వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీలో ఐజీగా డిప్యుటేషన్‌పై పనిచేశారు. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సమయంలో, సీఐడీ కస్టడీలో ఉండగా తనపై సునీల్ నాయక్ నేతృత్వంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై తీవ్రంగా కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సునీల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే ఏపీ పోలీసులు బిహార్ ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించారు. పట్నాలోని స్థానిక కోర్టులో ఆయనను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ (ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నిందితుడిని తరలించే అనుమతి) కోరారు. కోర్టు అనుమతి లభించడంతో ఇవాళ రాత్రికి ఆయనను విమానంలో లేదా రోడ్డు మార్గంలో గుంటూరుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఈ అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గత ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందనే సంకేతాలు ఈ ఘటనతో స్పష్టమవుతున్నాయి. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికారులు కూడా విచారణను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments