మృతి చెందిన చేపలతో కలుషిత వాతావరణం – వాకర్స్ ఆవేదన రాజమండ్రి నగరానికి ఆభరణంగా భావించే కంబాలచెరువు ఆహ్లాదం చాటున దుర్గంధం వెదజల్లుతోంది. చెరువులో కుప్పలు తెప్పలుగా చేపలు మృతి చెందడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. ఉదయం, సాయంత్రం వాకింగ్కు వచ్చే సందర్శకులు ముక్కు మూసుకుని తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
చెరువు నీటిలో తేలియాడుతున్న మృతి చెందిన చేపలు రోజురోజుకీ పెరుగుతుండటంతో పరిస్థితి మరింత విషమిస్తోంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో దుర్గంధం తీవ్రంగా ఉండటంతో వాకర్స్ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. “ఆరోగ్య కోసం వాకింగ్కు వస్తే ఇక్కడ పరిస్థితి భరించలేనిదిగా మారింది” అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, చెరువులో నీటి కాలుష్యం పెరగడం లేదా ఆక్సిజన్ లోపం కారణంగా చేపలు మృతి చెందే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అయితే, మృతి చెందిన చేపలను వెంటనే తొలగించడంలో నగరపాలక సంస్థ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కంబాలచెరువు పరిసర ప్రాంతం ప్రజల విశ్రాంతి, వ్యాయామానికి ముఖ్య కేంద్రమై ఉండటంతో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వాకర్స్, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెరువు నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహించి, శుభ్రత చర్యలు చేపట్టి దుర్గంధ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి చెరువును పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంరా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
కంబాలచెరువులో దుర్గంధం
RELATED ARTICLES
