గణతంత్ర దినోత్సవం వంటి అత్యంత ప్రాముఖ్యమైన రోజున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రంగా మండిపడ్డారు. సిటీ క్వారీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మరియు పార్లమెంట్ నమూనా కట్టడాన్ని గత జగనన్న ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంరక్షణను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
తూర్పు గోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా రాజమండ్రిలోనే నివాసం ఉంటూ, కూటమి ప్రభుత్వం తరఫున ఆరు మంది ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇంత ముఖ్యమైన కట్టడాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని భరత్ వ్యాఖ్యానించారు. ఎండకు, వానకు వదిలేయడం వల్ల మట్టి కొట్టుకుపోయి, శుభ్రత లేకుండా అంబేద్కర్ విగ్రహం దయనీయ స్థితిలో ఉందంటే అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. ఇది కేవలం విగ్రహం నిర్లక్ష్యం కాదని, రాజ్యాంగ విలువల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు.
గణతంత్ర దినోత్సవం రోజున వైసీపీ శ్రేణులు మార్గాని భరత్ నేతృత్వంలో మంచి నీటి ట్యాంకర్ తీసుకువచ్చి డాక్టర్ అంబేద్కర్ విగ్రహం మరియు పార్లమెంట్ నమూనా కట్టడాన్ని శుభ్రపరిచారని తెలిపారు. రాజ్యాంగం మీద, అంబేద్కర్ ఆశయాల మీద తమకు ఉన్న గౌరవాన్ని ఈ చర్య ద్వారా ప్రజలకు చాటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసన తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలకే తూట్లు – కూటమి నిర్లక్ష్యంపై మార్గాని భరత్ ఘాటు ఆరోపణలు
RELATED ARTICLES
