రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు ఇఫ్తార్ విందు ఇచ్చారు. సోమవారం ఈ సందర్భంగా పేద ముస్లింలకు ‘అమృత కలశం’ సేవ చేశారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా, ఆయన బోధించిన “మతాలన్నీ ఒక్కటే, ప్రేమే మానవతకు నిజమైన మార్గం” అనే మహోన్నత సందేశాన్ని స్మరించుకుంటూ శ్రీ సత్యసాయి విశాఖ జిల్లా సేవా సంస్థలు రంజాన్ పవిత్ర మాసంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వి.పి కాలనీ లోని శ్రీ సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో స్థానిక మూడు మసీదులకు చెందిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి, సౌభ్రాతృత్వం, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన కొంతమంది ముస్లింలకు “అమృత కలశం” (తోఫా) అందజేసి, ప్రేమతో కూడిన సహాయ హస్తాన్ని అందించాయి. ఈ సేవా కార్యక్రమం భగవాన్ బాబా బోధించిన నిస్వార్థ సేవా భావం మరియు మానవతా విలువలను ప్రతిబింబించింది. ఈ ఇఫ్తార్ విందులో తారా మసీదు, మొహమ్మదియా మసీదు, ఆల్ మదీనా మసీదు నుండి ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారా మసీదు ప్రెసిడెంట్ అడ్వకేట్ రజాక్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒక్కటేనని, అందరినీ ప్రేమించు -అందరినీ సేవించు అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి సందేశం, అందరు గురువులు కూడా అదే బోధించారన్నారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా మైనారిటీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెక్రటరీ డాక్టర్ బాబా, విశాఖ జిల్లా అధ్యక్షులు పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, సిటీ సమితి కన్వీనర్ బి. సాయికుమార్, రాష్ట్ర , జిల్లా పదాధికారులు సేవాదళ సభ్యులు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

