మహిళల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా జన్ సున్వాయ్ కార్యక్రమం నేడు (మార్చి 12) రాజమహేంద్రవరం ఆర్ & బి గెస్ట్ హౌస్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరై మహిళల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 13 వరకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేకంగా ‘జన్ సున్వాయ్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి.శ్రీదేవి తెలిపారు.
ఈ కార్యక్రమం భాగంగా మార్చి 12న ఉదయం 9:30 గంటలకు రాజమహేంద్రవరం ఆర్ & బి గెస్ట్ హౌస్ మీటింగ్ హాల్లో మహిళలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. గృహహింస, వరకట్న వేధింపులు, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు తదితర అంశాలపై మహిళలు తమ ఫిర్యాదులను సంబంధిత ఆధార పత్రాలతో సమర్పించవచ్చని తెలిపారు.
సమర్పించిన అర్జీలను చైర్పర్సన్ పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచనలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
