భారతదేశంలో చలనచిత్రం ఈరోజు కోట్లాది ప్రజలను ఆకట్టుకునే అత్యంత ప్రభావవంతమైన కళారూపంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన చిత్రరంగాలలో భారతీయ చిత్రరంగం ఒకటిగా నిలిచింది. ప్రతి సంవత్సరం వందలాది చిత్రాలు అనేక భాషల్లో రూపొందుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ విశాలమైన చిత్రప్రపంచానికి ఆరంభం ఒక చిన్న ప్రయత్నంతోనే జరిగింది. భారతదేశపు తొలి సంపూర్ణ నిడివి గల చలనచిత్రంగా గుర్తింపు పొందింది రాజాహరిశ్చంద్ర.
ఈ చిత్రాన్ని భారతీయ చిత్రరంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన దాదాసాహెబ్ ఫాల్కె నిర్మించి దర్శకత్వం వహించారు. 1913 మే 3న ఈ చిత్రం మొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చింది. ఆ రోజుల్లో చలనచిత్రం అనే కళారూపం భారతదేశంలో కొత్తగా పరిచయమవుతున్న కాలం. అయినప్పటికీ ఫాల్కే గారి దృఢ సంకల్పం, అపారమైన శ్రమ వల్ల ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
ఈ చలనచిత్ర కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందిన సత్యవ్రతుడైన రాజు హరిశ్చంద్రుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించబడింది. సత్యానికి కట్టుబడి ఏ పరిస్థితిలోనూ తన మాటను తప్పని రాజు హరిశ్చంద్రుడి ధర్మనిష్ఠ, త్యాగం, నిబద్ధతలను ఇందులో చిత్రీకరించారు. భారతీయ సంస్కృతి, నీతి విలువలను ప్రతిబింబించే ఈ కథ ప్రేక్షకుల మనసులను బలంగా ఆకట్టుకుంది.
ఆ కాలంలో చిత్ర నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సదుపాయాలు చాలా పరిమితంగా ఉండేవి. చిత్రీకరణ యంత్రాలు, దృశ్య పట్టికలు వంటి పరికరాలు దేశంలో అందుబాటులో లేక విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. దాదాసాహెబ్ ఫాల్కే స్వయంగా విదేశాలకు వెళ్లి చిత్ర నిర్మాణ విధానాలను అభ్యసించి వచ్చారు. అనంతరం తన ఇంటినే చిన్న చిత్ర నిర్మాణ కేంద్రంగా మార్చి ఎంతో కష్టపడి ఈ చలనచిత్రాన్ని రూపొందించారు.
ఈ చిత్ర నిర్మాణంలో మరో విశేషం ఏమిటంటే మహిళా పాత్రలను కూడా పురుషులే పోషించడం. ఆ రోజుల్లో మహిళలు చిత్రాల్లో నటించేందుకు ముందుకు రావడం చాలా అరుదు. అందువల్ల రాణి పాత్రను కూడా ఒక పురుష నటుడు పోషించాడు. ఈ చిత్రంలో రాజు హరిశ్చంద్రుడి పాత్రను దత్తాత్రేయ దిగంబర్ దబ్కే పోషించారు.
చిత్రం ప్రజల ముందుకు వచ్చిన తరువాత మంచి స్పందన లభించింది. ప్రజల్లో చలనచిత్రం పట్ల ఆసక్తి పెరగడానికి ఇది ప్రధాన కారణమైంది. తర్వాతి కాలంలో అనేక మంది నిర్మాతలు, దర్శకులు ఈ రంగంలోకి ప్రవేశించారు. ఈ విధంగా రాజా హరిశ్చంద్ర భారతీయ చిత్రరంగానికి పునాది వేసిన చారిత్రక కృతిగా నిలిచింది.
1913లో ప్రారంభమైన ఈ ప్రయాణం నేటికి శతాబ్దాన్ని దాటి మరింత విస్తరించింది. ప్రస్తుతం భారతదేశంలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ తదితర భాషల్లో వేలాది చిత్రాలు రూపొందుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయ చిత్రాలు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించాయి.
భారతదేశపు తొలి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు; అది భారతీయ చిత్రరంగ ఆవిర్భావానికి ప్రతీకగా నిలిచిన చారిత్రక మైలురాయి. ఒక వ్యక్తి కల, కృషి, పట్టుదల కలిసినప్పుడు కొత్త యుగానికి నాంది పలకవచ్చని ఈ చలనచిత్ర గాథ స్పష్టంగా తెలియజేస్తుంది.
(సి.హెచ్.ప్రతాప్)
