మేయర్ పీలా తో కలసి ఎమ్మెల్యే పంచకర్ల శంకుస్థాపన
పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 10 వార్డుల్లో గత ఎనిమిది నెలల కాలంలోనే రూ. 200 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 77వ వార్డులో స్థానిక కార్పొరేటర్ బుట్ట సూర్య కుమారి గారి ఆధ్వర్యంలో పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77వ వార్డులో పిట్టవానిపాలెం, ఇస్లాంపేట, మస్కాంతొడ్డి, మర దాసరి పేట, గొలుసువానిపాలెం, లక్ష్మీ నగర్, పిలకవానిపాలెం, నక్కవానిపాలెం తదితర ప్రాంతాలలో జీవీఎంసీ నిధులతో సుమారు 7.5 కోట్లతో చేపట్టిన సిసి రోడ్లు, కాలువలు నిర్మాణానికి మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మంగళవారం ఉదయం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారద్యంలోని కూటమి ప్రభుత్వానికి, గత ఐదేళ్ల వైసిపి ప్రభుత్వానికి అభివృద్ధిలో తేడాను గుర్తించాలని ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమపాలల్లో అమలు చేస్తూ ప్రజా రంజక పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. పెందుర్తి నియోజకవర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ కావడం పెందుర్తి నియోజకవర్గ ప్రజల అదృష్టమని, ఇతరులు అసూయపడేలా పెందుర్తి నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నారని కొనియాడారు. నగరంలో రోడ్లు ఉన్నందున, విలీన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసి మళ్లీ మీ ముందుకు వస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అగనంపూడి జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ, స్థానిక జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు కాకి బాబు, తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు మంత్రి రవి, ఉపాధ్యక్షులు నక్క శ్రీనివాస్ రావు, బిజెపి పార్టీ మహిళా అధ్యక్షురాలు సరస్వతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల అచల నాయుడు, చౌడిపల్లి పరదేశి, కొండబాబు, పిట్ట కనక రెడ్డి, శంకర్రావు, చిట్టి బాబు, పైడి రెడ్డి, నొక రెడ్డి , రమణ తదితర నేతలు, పెదగంట్యాడ మండలం జీవీఎంసీ 77 వ వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు
