యుద్ధంలో చిక్కుకున్న మన వారిని వెనక్కి రప్పించాలి*
ఉగాది నుంచైనా రాజకీయ పార్టీలు హుందాగా వ్యవహరించాలి *
తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ భయం వెంటాడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు లడ్డు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు.. లో మంగళవారం ఉదయం బి.వి.రామ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరాక్ – ఇజ్రాయెల్ / అమెరికా యుద్ధం కారణంగా లక్షల మంది తెలుగువారు ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. యుద్ధ ప్రభావం సౌదీ అరేబియా ఖతర్, దుబాయ్ తదితర గల్ఫ్ దేశాలలో స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులలో విదేశాలలో చిక్కుకుపోయిన తెలుగువారిని సురక్షితంగా తక్షణమే సొంత గడ్డకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వైసీపీ కూడా యుద్ధ భయంలో ఉన్న తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు ప్రభుత్వానికి తగిన రీతిలో సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా తిరుపతి లడ్డు అంశమే ప్రధాన ఎజెండా అన్నట్టుగా కూటమి ప్రభుత్వంలోని రాజకీయ పార్టీలతో పాటు వైసిపి కూడా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆధ్యాత్మికతకు రాజకీయానికి ముడి పెట్టవద్దని, ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజలు రాజకీయ పార్టీలను ఛీ కొడుతున్నారని.. కనీసం తెలుగు సంవత్సరాది ఉగాది నుంచైనా రాజకీయ పక్షాల నాయకులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
విలేకరుల సమావేశం లో వై.ఆర్.వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
